మహా కుంభమేళాలో శ్రీవారికి వైభవంగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళా ప్రాంగణంలో, ప్రయాగ్‌రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 16,2025: ప్రపంచంలోని అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహా కుంభమేళా ప్రాంగణంలో, ప్రయాగ్‌రాజ్ దశాశ్వమేధ ఘాట్ వద్ద గురువారం టీటీడీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు.

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితుల నేతృత్వంలో, అర్చకుల బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస స్వామివారికి పవిత్ర గంగా నది తీరాన అభిషేక కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించడం భక్తులను భక్తి మయంగా మంత్రముగ్ధుల్ని చేసింది.

ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పురుషసూక్తం, నారాయణ సూక్తం వంటి పంచసూక్తాలను శ్రవణమైమరచేలా వల్లించారు. అభిషేకానంతరం, స్వామివారిని తులసిమాలలతో అద్భుతంగా అలంకరించారు. సహస్రధారాపాత్రతో అభిషేకాన్ని వైదికరీతుల ప్రకారం పూర్తి చేశారు.

తరువాత, శ్రీ చక్రతాళ్వార్‌ను మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ గంగా నదిలోకి తీసుకువెళ్లి, ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ పుణ్య కార్యంలో హెచ్‌డీపీపీ కార్యదర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ గురు రాజస్వామి తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author