ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులు భేటీ
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 18,2025: పర్యావరణహితమైన వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై గౌరవ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 18,2025: పర్యావరణహితమైన వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ దిశగా, ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా అందుబాటులోకి రావాలి,” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.

శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, పీపుల్ టెక్ సంస్థ ఓర్వకల్లు వద్ద 12వందల ఎకరాల భూమిలో ఎలక్ట్రిక్ వాహనాల పార్కు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో ఎం.ఓ.యూ. చేసుకున్నట్లు సంస్థ గ్రూప్ సీఈఓ టి.జి. విశ్వప్రసాద్ వివరించారు.
ఈ పార్కులో వాహన తయారీ, ఆర్ అండ్ డి కేంద్రాలు, టెస్టింగ్ ట్రాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ప్రాంతాలు ఉంటాయని ఆయన తెలిపారు. “దేశంలో ఇదే తొలి ప్రైవేట్ ఈ.వి. పార్కు. దీనివల్ల రూ.13 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి, 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి” అని ఆయన చెప్పారు.

పవన్ కల్యాణ్ స్పందిస్తూ, “కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఎలక్ట్రిక్ వాహనాల పార్కు ఏర్పాటవడం అనేది ఆహ్వానించదగిన పరిణామం. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమైన మైలు రాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అనువైన విధానాలు తీసుకువచ్చింది” అన్నారు.
ఈ సమావేశంలో పీపుల్ టెక్ సంస్థ ప్రతినిధులుగా భాస్కర రెడ్డి, రవికిరణ్ ఆకెళ్ళ, బాబ్ డఫ్ఫీ, స్టీవ్ గెర్బర్,హెరాల్డ్ రక్రిజెల్ పాల్గొన్నారు.