నంబూరు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 18,2025: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం, నంబూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 18,2025: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం, నంబూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని, గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ రోజు (శనివారం), రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతీ నెల మూడో శనివారంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ కార్యక్రమం నంబూరు గ్రామంలో ప్రారంభమయ్యింది. ఇందులో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు శాసన సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం భాగంగా, నంబూరులో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద మొక్కను నాటి ప్రారంభించారు. అనంతరం, గ్రామ స్థాయిలో సేకరించిన చెత్తను ఎటువంటి విధానంలో నిర్వహిస్తామో పరిశీలించారు.
మొదటగా పళ్లు, కూరగాయల వ్యర్థాల నిర్వహణను పరిశీలించి, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్, శానిటరీ వ్యర్థాల నిర్వహణ పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. వ్యర్థాలతో వర్మి కంపోస్టు తయారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు.
ఇంటి నుంచి చెత్త సేకరించడానికి ఉపయోగించే మూడు రకాల బుట్టలను పవన్ కళ్యాణ్ కి చూపించారు. తడి చెత్త, పొడి చెత్త, విషపూరిత వ్యర్థాలను వేరు చేసేందుకు ప్రత్యేకంగా ఈ మూడు చెత్త బుట్టలు ఇవ్వాలని అధికారులు తెలిపారు. చెత్త నిర్వహణకు ఉపయోగించే యంత్రపరికరాల పనితీరును కూడా అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల విజయవాడ వరదలలో అహర్నిశలు పని చేసి, పారిశుద్ధ్య మెరుగుదలకు కృషి చేసిన 35 మంది స్వచ్ఛ కార్మికులను పవన్ కళ్యాణ్ సత్కరించారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలుకరిస్తూ, శాలువా కప్పి, నూతన వస్త్రాలు, పళ్లు బహూకరించారు.

అనంతరం, గ్రామ స్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించి, స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమంలో, గ్రామంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు.