పిఠాపురం సంపూర్ణ అభివృద్ధికి ‘పాడా’ (పిఠాపురం ఏరియా డవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటు..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 5,2024: ‘రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలన్నీ గత ప్రభుత్వ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 5,2024: ‘రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలన్నీ గత ప్రభుత్వ వారతస్వంలో భాగమే. మూడు నెలల చిన్నారిని చిదిమేసే క్రూరులు… అయిదేళ్ల బిడ్డపై అత్యాచారానికి పాల్పడే దుర్మార్గులు… దొంగతనానికి వెళ్లి ఇంట్లోని వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు తీసే నీచులు… చేస్తున్న అఘాయిత్యాలకు గత ప్రభుత్వం మిగిల్చిన పాపాలే కారణం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో ఈ అరాచక శక్తులను అప్పటి పాలకులే పెంచి పోషించారని తేల్చిచెప్పారు. అరాచకవాదులు ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యను అనరాని మాటలు అన్నా అప్పటి ప్రభుత్వం నుంచి చర్యల్లేవ్… ఓ పార్టీకి అధ్యక్షుడిగా, ప్రజాదరణ ఉన్న వ్యక్తిగా నా ఇంట్లోని వాళ్లను వచ్చి రేప్ చేస్తామని బాహాటంగా అసాంఘిక శక్తులు ప్రకటించినా అప్పట్లో కేసుల్లేవు.

దీంతో రౌడీల్లో, అరాచక, అసాంఘిక శక్తుల్లో బరితెగింపు ఎక్కువయిందని ఉద్ఘాటించారు. ఈ తెగింపు తారస్థాయికి వెళ్లి, గత ప్రభుత్వ నేర వారసత్వాన్ని కొనసాగిస్తూ అవే అరాచకశక్తులు నేడు అఘాయిత్యాలను కొనసాగిస్తున్నార’న్నారు.

సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలు, మూడు చక్రాల సైకిళ్లు అందజేశారు. దీంతో పాటు నియోజకవర్గంలోనూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. ‘‘ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ఏర్పాటు చేస్తాం. పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలో రూ.14.48 కోట్ల అంచనా వ్యయంతో 223 సీసీ రోడ్లను నిర్మిస్తున్నాం.

ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి పల్లె రోడ్లను ప్రధాన రహదారులతో అనుసంధానం చేస్తాం. మరో రూ.5.44 కోట్లతో సీసీ రోడ్ల పనులు ప్రారంభిస్తున్నాం. యూ.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలకు రక్షిత మంచినీటి సరఫరా కోసం రూ.56 లక్షల అంచనా వ్యయంతో కాంప్రహెన్సివ్ ప్రొటెక్టడ్ వెల్ఫేర్ స్కీమ్ కింద మరమ్మతు పనులు చేస్తున్నాం.

రూ. 1.34 కోట్లతో దూడల సంత ఆదునీకీకరణ పనులకు టెండర్లు పిలిచాం. పనులు నెలాఖరుకు ప్రారంభమవుతాయి. రూ.20 లక్షల అంచనా వ్యయంతో టీటీడీ మాడ వీధులను అభివృద్ధి చేస్తున్నాం. రూ.73 లక్షల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణమండపంలో భోజనశాల, డైనింగ్ హాల్, మండపం అభివృద్ధి పనులు ప్రారంభించాం.

పిఠాపురం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ బిల్డింగ్ లోని పెండింగ్ పనులకు రూ. 23 లక్షల నిధులు మంజూరు చేశాం. బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆటస్థలం అభివృద్ధి కోసం రూ.10.50 లక్షలు మంజూరు చేశాం. డిగ్రీ కళాశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 10 లక్షలు విడుదల చేశాం.

పిఠాపురం సి.హెచ్.సిలో రూ. 1.07 లక్షలతో ఫ్రీజర్ కొసుగోలు చేశాం. పిఠాపురం ప్రజల కోరిక మేరకు విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు బైపాస్ లో ఆపే విధంగా చర్యలు తీసుకున్నాం.

• రూ. 4 కోట్ల వ్యయంతో సుద్దగడ్డపై వంతెన

450 కుటుంబాలకు ఇబ్బంది లేకుండా సుద్దగడ్డ వాగుపై రూ. 4 కోట్ల వ్యయంతో వంతెన నిర్మిస్తున్నాం. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఎస్సీ స్మశానవాటికకు అప్రోచ్ రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్మశానవాటిక అప్రోచ్ రోడ్డు కోసం 22 సెంట్ల స్థలం భూసేకరణకు చర్యలు చేపట్టాం.

రూ. 28 లక్షల నరేగా నిధులతో అప్రోచ్ రోడ్డు నిర్మిస్తున్నాం. గొల్లప్రోలు మండలం సూరంపేట కాలనీలో 450 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. రోజువారీ పనులు కోసం గొల్లప్రోలు పట్టణానికి రావాలంటే సుద్దగడ్డ వాగు దాటాలి. వర్షకాలంలో వాగు పొంగినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

వారి సమస్య పరిష్కారానికి అసంపూర్తిగా ఉన్న సూరంపేట వంతెన నిర్మాణానికి రూ. 24 లక్షలతో పనులకు టెండర్లు పిలిచాం. నెలాఖరున పనులు ప్రారంభమవుతాయి. గొల్లప్రోలులో రూ.16 లక్షలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పనులు ప్రారంభిస్తున్నాం. రూ.28 లక్షలతో అసంపూర్తిగా మిగిలిపోయిన తాహసీల్దార్ బిల్డింగ్ పూర్తి చేస్తున్నాం.

జడ్పీ బాలురోన్నత పాఠశాలలో మూడు తరగతి గదుల మరమ్మతులకు రూ. 19 లక్షలు మంజూరు చేశాం. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 33 జిల్లా పరిషత్ పాఠశాల్లో సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి రూ. 9.90 లక్షల నిధులను మంజూరు చేశాం. గొల్లప్రోలులో మొగలసూరీడు మంచినీటి చెరువును ఆధునికీకరణ పనులు పూర్తి చేసి… దాని చుట్టూ రూ. 3.20 లక్షలతో వాకింగ్ ట్రాక్ నిర్మిస్తాం.

యు.కొత్తపల్లి మండలం రవీంద్రపురం, ఇసుకపల్లి, శొంఠివారిపాకలు, నిదానందొడ్డి గ్రామాల్లో మండల పరిషత్ పాఠశాలలకు సరైన భవనాలు లేవు. రూ. 80 లక్షల నిధులతో పాఠశాల భవనాలను నిర్మిస్తున్నాం. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి ఔట్ పేషెంట్ బ్లాక్ రూ. 7.50 లక్షలతో నిర్మిస్తున్నాం. ములాపేట సాంఘిక సంక్షేమ వసతిగృహంలో రూ. 4.56 లక్షల అభివృద్ధి పనులకు అనుమతులు జారీ చేసాం.

• 100 పడకల ఆసుపత్రిగా పిఠాపురం సి.హెచ్.సి.

పిఠాపురం సి.హెచ్.సి.ని 30 పడకల ఆస్పత్రి నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేస్తాం. దీని కోసం రూ. 39.76 కోట్లతో అంచనా వ్యయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. యూ. కొత్తపల్లిలో టీటీడీ ఆధ్వర్యంలో రూ. 2 కోట్లతో కళ్యాణ మండపం నిర్మిస్తున్నాం.

సెరీ కల్చర్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చడానికి ఏపీ స్టేట్ సెరీకల్చర్ రీసెర్చ్ అండ్ డవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిందూపుర్ నుంచి శాస్ర్తవేత్తలు వచ్చారు. వారు అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తారు. ఇటీవల పట్టుపురుగులు గూడు కట్టుకోకపోవడం వల్ల రైతులకు నష్టం వచ్చిందని నా దృష్టికి తీసుకొచ్చారు. వారికి వెనువెంటనే నష్ట పరిహార చెక్కును అందజేస్తున్నాం.

కోటి రూపాయల వ్యయంతో పిఠాపురంలో నగర వనాలను అభివృద్ధి చేస్తున్నాం. పిఠాపురంలో మరుగునీటి వ్యవస్థను చక్కదిద్దేందుకు భూసేకరణ ప్రక్రియ చేపట్టాం. గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామ విద్యార్థులు 9వ తరగతి చదవాలంటే దాదాపు 15 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని నా దృష్టికి వచ్చింది. వచ్చే ఏడాది చెందుర్తిలో ఉన్న పాఠశాలను హైస్కూలుగా అప్ గ్రేడ్ చేస్తాం.

• వారి వారసత్వ జాడలే

గత ప్రభుత్వ పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు. అవి పని చేయడం మానేశాయి. విశాఖపట్నంలో అన్ని అనుమతులు తీసుకొని జనవాణికి వెళ్తున్న నన్ను ఐపీఎస్ అధికారి గరుడ్ సుమిత్ కనీసం ప్రజలకు అభివాదం చేయవద్దని ఆజ్ఞాపించారు. అదే పోలీసు వ్యవస్థ- నా ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను రేప్ చేస్తామని బాహాటంగా చెప్పిన రౌడీలను మాత్రం ఏమీ చేయలేకపోయింది.

పోలీసులు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తామని ప్రమాణం చేసి విధుల్లోకి వస్తారు. అలాంటిది పోలీసులు గత ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయడం మానేశారు. దీంతో అసాంఘిక శక్తుల్లో భయం పోయింది. వారు రెచ్చిపోయి మరీ అఘాయిత్యాలకు తెగబడ్డారు. వారి వారసత్వ జాడలే ఇప్పడు మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి.

• మీనమేషాలు లెక్కించవద్దు

పోలీసు వ్యవస్థ బలం చాలా పెద్దది. కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు గత ప్రభుత్వంలో చూపిన నిర్లిప్తత వీడి పని చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాల మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి. పోలీసులకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను పూర్తి స్వేచ్ఛను ఇచ్చాము.

అయినా ఫలితాలు రావడం లేదు. పోలీసు శాఖ గత ప్రభుత్వ విధానాలు వీడి పనిచేయాలి. నేను ఏదైనా సహిస్తాను కానీ… ప్రజలకు కీడు జరిగితే మాత్రం క్షమించను. పోలీసులు అలసత్వం వీడి పనిచేయండి. మీన మేషాలు లెక్కించడం మానుకోండి. ధర్మబద్ధంగా ప్రజల కోసం, వారి రక్షణ కోసం పని చేయాలి.

రాష్ట్రం అభివృద్ధికి, ప్రజల సుఖసంతోషాలకు శాంతిభద్రతలు బలంగా ఉండటం ప్రధానం. దాన్ని కాపాడే బాధ్యత కలిగిన పోలీసులు సమర్థ వంతంగా పని చేయాలి. డీజీపీ నుంచి కిందిస్థాయి కానిస్టేబుల్ వరకు మీరు బలంగా పనిచేయాలి.

మాకు సహనం ఎంత ఉందో తెగింపు అంతే ఉంది. మీ పని తీరును మేం నిశితంగా గమనిస్తూనే ఉంటాం. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేలా మీరు నిజాయతీగా, నిబద్ధతతో పనిచేయాల్సిన సమయం ఇది.

• వైసీపీ నాయకులు, మద్దతుదారుల తీరు మారలేదు

రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఎందుకు పెరిగాయి అన్న దానిపై పోలీసులు శాస్త్రీయ పరిశీలన జరిపి ముందుకు వెళ్లాలి. బూతులు తిట్టినా, రేప్ చేస్తామని చెప్పినా గత ప్రభుత్వంలో అది భావ ప్రకటన, వాక్ స్వాతంత్రపు హక్కు అని వైసీపీ పెద్దలు నిర్వచనం ఇచ్చారు.

దీంతో ప్రతి ఒక్కరూ బూతులు తిట్టడం, బెదిరింపులకు పాల్పడటం, రేప్ చేస్తామని బహిరంగంగా చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. గత ప్రభుత్వంలో ఓ రేప్ కేసు నమోదు అయితే- అప్పటి నాయకులు ఒకటి, రెండు రేప్ లు జరిగితే ఏమవుతుంది అని మాట్లాడారు… 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయ్యారని గొంతు ఎత్తితే కనీస సమీక్ష చేయలేదు.

బుగ్గలు నిమరడం, నెత్తి మీద చేతులు వేయడం రక్షణ కాదు. ఆడబిడ్డల గురించి అసభ్యంగా మాట్లాడే వాడిని కఠినంగా శిక్షించి వారికి అండగా నిలవాలి. గత ప్రభుత్వంలో అది పూర్తిగా తప్పింది. నన్ను రాజకీయంగా విమర్శించండి.. పాలసీల మీద ఆరోపణలు చేయండి తీసుకుంటాం.

కానీ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులపై అసభ్యంగా మాట్లాడటం ఇప్పటికీ వైసీపీ నాయకులు, వారి మద్దతుదారులు మానుకోవడం లేదు. అదే నేర స్వభావాన్ని సమాజంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడటం, సాంకేతికత సహాయంతో మహిళలను అవమానించడం వంటి పద్ధతులు వైసీపీ నాయకులు ఇంకా మానుకోలేదు. ఇకపై దీన్ని సహించేది లేదు.

• సంయమనంతో ఉన్నాము.

అధికారంలో ఉన్నాం కాబట్టే సంయమనంతో ఉన్నాం. చేతగాక కాదు. వైసీపీకి తగిన బుద్ది చెప్పలేక కాదు. ఇదే వేదిక నుంచి పోలీసు వ్యవస్థకు, అధికారులకు చెబుతున్నా. శాంతిభద్రతలను కాపాడేందుకు కంకణబద్ధులై పనిచేయండి. పార్టీలు, కులం, మతం, ప్రాంతం అనేది చూడకండి.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా కఠినంగా వ్యవహరించండి. మాతో పదిసార్లు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. నా బంధువు అయినా నేరం చేస్తే శిక్షార్హుడే. తప్పు చేసిన వారికి వత్తాసు పలుకుతూ పోలీసుల వద్దకు ఎవరూ రారు. వచ్చినా వారిని పట్టించుకోవల్సిన అవసరం లేదు.

కులం, మతం అనేవి నేరాలు విషయంలో రక్షించవు. రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి అనిత గారికి కూడా ఒకటే చెబుతున్నా. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో మీరు మరింత కఠినంగా, నిర్దయ లేకుండా వ్యవహరించాలి. నేను కనుక హోంమత్రిత్వశాఖ తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయి.

నేను కలలో కూడా కోరుకునేదొక్కటే… అందరూ బాగుండాలి. రాష్ట్రం క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నేను మొదటి నుంచి చెబుతున్నట్లుగా మాది ప్రతీకార ప్రభుత్వం కాదు… అలాగే చేతగాని ప్రభుత్వం కూడా కాదు. ఇక అధికారులు చెప్పినవన్నీ వినడం అయిపోయింది.. ఇక చేతలే మిగిలాయి.

• శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఉండాలి

నేరగాళ్లను ప్రోత్సహించిన వారికి, నేరగాళ్లకు ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వ తరహా ట్రీట్ మెంట్ అవసరం. రాష్ట్రంలో జరుగుతున్న పైసాచిక ఘటనలు సింగపూర్, దుబాయ్ లాంటి దేశాల్లో జరగకపోవడానికి అక్కడున్న కఠిన చట్టాలతోపాటు నేరస్థులను ప్రోత్సహించని జన సమూహం అక్కడ ఉంటుంది.

అలాంటి చైతన్యం మన దగ్గర కూడా రావాలి. పవన్ కళ్యాణ్ కే కదా ఇలా జరిగింది.. మనకేంటీలే అనుకునే స్వభావం వీడి ప్రతి ఒక్కరూ నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే తప్ప.. సమాజంలో మార్పు రాదు. పోలీసులకు మరోసారి చెబుతున్నాను… ప్రజల్లోకి వెళ్తున్న మమ్మల్ని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల విషయంలో డీజీపీ, ఇంటిలిజెన్స్ డీజీ కూడా పూర్తిస్థాయి దృష్టి నిలపాలి.

గత 4 నెలల్లో ఒక్కసారి అయినా ఎన్డీయే ఎమ్మెల్యేలు వసతిగృహాలకు వెళ్లారా..? వారి సమస్యలు విన్నారా..? అధికారం వచ్చింది కేవలం విలాసం కోసం కాదు. దాన్ని గుర్తుంచుకోండి. ప్రజలు కోటి ఆశలతో, వారి కష్టాలు తీరుతాయన్న నమ్మకంతోనే అధికారం ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. జనసేన నాయకులు, వీర మహిళలు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి.

• ఇసుక మీ హక్కు తీసుకెళ్లండి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశాల్లో ఉచిత ఇసుక మీద పదేపదే మంత్రులను హెచ్చరిస్తున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు కూడా ఉచిత ఇసుక విషయంలో కలగజేసుకోవద్దని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ఉచిత ఇసుక అనేది ప్రజల హక్కు.

నేను కానీ, చంద్రబాబు కాని మీ ఇంటికి వచ్చి ఉచిత ఇసుక అందించలేం కానీ.. మీ నిర్మాణ అవసరాలకు ప్రజలు ఎవరైనా సమీపంలోని రీచ్ కు వెళ్లి వాహనాలపై ఇసుకను పూర్తి ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు జులుం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలి. అంతా ఏకమై ఎదిరించాలి.

మీరు ఓ కంఠక పాలనపై ఓటెత్తి ఓ విప్లవం తరహాలో తిరగబడ్డారో అలాంటి పరిస్థితే రావాలి. ఉచిత ఇసుక అనేది ప్రభుత్వం కల్పించిన హక్కు. ఇది నల్లబజారుకు తరలిపోకుండా ప్రజల అవసరాలకు ఉపయోగపడాలి. ప్రజలకు పోలీసులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం తగిన విధంగా సహకరించాలి తప్పితే ప్రజలను ఇబ్బంది పెట్టేలా మాత్రం పనిచేయొద్దు.

తీర ప్రాంతాల్లో కొన్ని ఫార్మా కంపెనీలు ముఖ్యంగా అరబిందో, దివీస్ వంటి అగ్రసంస్థలు యథేచ్ఛగా తమ వ్యర్థాలను సముద్రంలో కలిపేస్తున్నాయి. ఫార్మా రంగం అనేది దేశ అభివృద్ధిలో మూలం. అయితే శుద్ధి చేయకుండా పరిశ్రమల్లో వచ్చే వ్యర్థాలను సముద్రంలో కలిపేస్తుండటంతో మత్స్య సంపద నాశనం అవుతోంది.

ఫలితంగా మత్స్యకారుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. దీనిపై పర్యావరణ శాఖ అధికారులు కూడా అన్ని అనుమతులు తీసుకున్నట్లు చెబుతున్నారు కానీ.. ఎక్కడో తప్పు జరుగుతోంది. లేకపోతే ఇంతమంది కాలుష్యo మీద ఫిర్యాదు చేయరు. కంపెనీలు తమ లాభాల బాటలో జరుగుతున్న నష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

దీనిపై మత్స్యకారులను, ఫార్మా కంపెనీలను కూర్చొబెట్టి తగిన విధంగా రెండు వైపులా న్యాయం జరిగేలా మాట్లాడాలని కోరుకుంటున్నారు. సమస్యకు పరిష్కారం దిశగా వెళ్లాలి తప్ప.. సమస్యను సంక్లిష్టం చేయకూడదన్నదే నా భావన. కంపెనీలో కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బులిటీ ఫండ్స్ ఇస్తున్నాం… మేం ఏ రకంగా అయినా ముందుకు వెళ్తాం అంటే కుదరదు. ప్రజలకు హాని కలిగించే చర్యలను మేం ఒప్పుకోం. మత్స్యకారులకు ఇబ్బంది కలిగితే స్పందిస్తాం.

• శ్రీ మోదీ గారి మాటలే మాకు స్ఫూర్తి

చుట్టూ గోదావరి ఉన్నా పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తాగునీరు లేదు. దానికి కారణం ఆక్వా కాలుష్యం. భయంకరమైన కాలుష్యం వల్ల రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. మోదీ ఇటీవల పెట్టుబడుల సదస్సులో ఇచ్చిన సందేశం స్ఫూర్తివంతమైంది. ‘‘భూమి మన అత్యాశను తీర్చుకోవడానికి లేదు..

ప్రకృతిని, భూమిని ఎంత సుందరంగా, చక్కగా వినియోగించుకొని తర్వాతి తరాలకు అందిస్తామో మన మనుగడ అంతేకాలం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు వెదజల్లే కాలుష్యం వల్లనే భూమి వినాశనం అవుతుందనే మాటలు కంటే… అభివృద్ధిలో పర్యావరణహితం ఎంతగా దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందనేది మేం బలంగా నమ్ముతాం. ఆ దిశగా ప్రయాణం చేస్తాం..

ఇది సనాతన ధర్మంలో ఓ భాగం. సమస్త చరాచరాలకు హాని చేయని అభివృద్ధి మా ధర్మం’’ అని మోదీ గారు చేసిన ప్రసంగం అత్యత్తమమైనది. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ఎవరి పరిధిలో వారు పర్యావరణ రక్షణ కోసం పనిచేయాలి.

పెద్ద ప్రాజెక్టులు పూర్తి అయ్యే ముందే స్థానికంగా తాగునీటి అవసరాలు తీర్చే చెరువుల సుందరీకరణకు అంతా నడుం బిగించాలి. చెరువుల సుందరీకరణ అంటే మట్టి అమ్ముకోవడం కాదు.. పదిమందికి ఉపయోగపడే మంచినీటి వనరుకు పునరుజ్జీవం అని గుర్తుంచుకోవాలి.

• కాకినాడ సెజ్ భూములపై దృష్టి

కాకినాడ ఎస్ఈజడ్ భూముల సమస్య ఎప్పటి నుంచో ఉంది. దీనిలో రైతులు నష్టపోయారు. సెజ్ భూములు అరబిందో ఫార్మా తీసుకుంది. 6 వేల ఎకరాల పైబడి భూములను ఇచ్చిన రైతుల లక్ష్యం నెరవేరాలి. అక్కడ ఆ భూముల తాలుకా అసలు ఉద్దేశం తీరాలి.

ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల్లో చాలా భూములు నిరూపయోగంగా ఉన్నాయి. సుమారు 1200 ఎకరాల భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని కోర్టులు తీర్చు ఇచ్చి ఉన్నాయి. నష్టపోయిన రైతాంగానికి తగిన సాయం కూడా అందాల్సి ఉంది. నేను పారిశ్రామికవేత్తలను విడిగా కలవను. ఎందుకంటే రకరకాల మాటలు వస్తాయి.

అందుకే ప్రజలకు మేలు జరిగిన తర్వాతే, వారు సదరు పారిశ్రామికవేత్తల నుంచి తగిన న్యాయం పొందినపుడే ప్రజల సమక్షంలోనే వారిని కలుస్తాను. నాకు ప్రజలకు న్యాయం జరిగినపుడే అసలు ఆనందం.

• కూటమి ప్రభుత్వంలో పూర్తి చేసిన పనులు

పిఠాపురం నియోజకవర్గంలోని 32 ప్రాథమిక ఉన్నత పాఠశాలకు రూ. 25 వేలు విలువ చేసే క్రీడా సామగ్రి కిట్లను అందజేశాం. ఇందుకోసం దాదాపు రూ. 16 లక్షలు ఖర్చు చేశాం. పిఠాపురంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మెరుగుపర్చేందుకు సిబ్బందిని పెంచాం. ఎక్స్ రే యూనిట్ ను పునరుద్ధరించాం.

ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేయని ఆర్వో ప్లాంట్ ను పునరుద్దరించి రక్షిత తాగు నీటిని కల్పించాం. గొల్లప్రోలు మండలంలో డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూసేకరణ చేస్తున్నాం. రూ. 4 లక్షల నిధులతో గొల్లప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోడ్లను నిర్మించాం. గొల్లప్రోలు ప్రాథమిక పాఠశాలలో రూ. 4 లక్షల నిధులతో ఆర్వో ప్లాంట్ నిర్మించాం.

గొల్లప్రోలు మండల పరిషత్ పాఠశాలలో పెండింగ్ పనులకు రూ. 1.75 లక్షల నిధులు విడుదల చేశాం. రూ.2 లక్షల నిధులతో చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశాం. గొల్లప్రోలు మహిళ జూనియర్ కళాశాల విద్యార్థులకు రూ. 1.10 లక్షల నిధులతో రెండు కంప్యూటర్లు అందించాం.

తాడిపర్తిలో రూ. 65వేల నిధులతో జడ్పీ హైస్కూలు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని వేరే చోటికి మార్చాం. తాడిపర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో పదోతరగతి పరీక్షలు రాసేందుకు అనుమతులు ఇచ్చాం. యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి జడ్పీహెచ్ స్కూల్లో రూ. 40 వేలు నిధులతో విద్యుత్ సదుపాయం కల్పించాం.

యు.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గీజర్, వాటర్ ప్యూరిఫైయర్ సదుపాయం కల్పించాం. పిఠాపురం నియోజకవర్గంలో అర్హులైన 39,997 మందికి పెన్షన్లు కింద ప్రతి నెల రూ. 16.68 కోట్లు అందిస్తున్నాం. దీపం 2 పథకం కింద ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే సబ్సిడీ సిలిండర్ల కోసం రూ. 19.06 లక్షలు ఖర్చు చేస్తున్నాం.

• కూటమి స్ఫూర్తిని ఎవరూ చెడగొట్టలేరు

రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. మొన్నటి హర్యానా ఎన్నికల్లో కూడా అక్కడి ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వానికి మద్దతు పలికారు. మహారాష్ట్రలో కూడా మరాఠా ఉద్యమం అని పాతిక సీట్లలో పోటీ చేస్తామన్నవారు కూడా వెనక్కి తగ్గారు. దేశంలో ఎక్కడికెళ్లినా ప్రజల్లో స్థిరమైన ప్రభుత్వం మీదనే నమ్మకం ఏర్పడుతోంది.

దీన్ని మనం కూడా రాష్ట్రంలో రక్షించుకోవాలి. మూడు పార్టీల కూటమి కేవల ఓ ఎన్నిక కోసం కాదు.. ఈ స్ఫూర్తి రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేందుకు పనిచేస్తుంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూటమి స్ఫూర్తి దెబ్బ తినదు. ఈ కూటమి స్నేహాన్ని వ్యక్తులు చెడగొట్టలేరు. ఈ కూటమితో వ్యక్తిగతంగా ఆటలాడొద్దు.

వైసీపీ నాయకులకు మరోసారి విన్నవిస్తున్నాను… పాలసీల ప్రకారం మాత్రమే మాట్లాడండి. మేం సమాధానం చెబుతాం. మా ఇష్టం.. మేం మారం… మేమింతే అంటే కనుక మేం కూడా మీ పద్ధతిలోకి మారాల్సి ఉంటుంది.. జాగ్రత్త’’ అని హెచ్చరించారు.


ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ నియోజక వర్గం ఇంచార్జ్ బి.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author