బీసీల హక్కుల కోసం ‘ధర్మ దీక్ష’: అమరణ నిరాహార దీక్షకు దిగిన రామచంద్ర యాదవ్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,​మంగళగిరి, ఏప్రిల్ 11,2026 : వెనుకబడిన తరగతుల సామాజిక న్యాయం, హక్కుల సాధనే లక్ష్యంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,​మంగళగిరి, ఏప్రిల్ 11,2026 : వెనుకబడిన తరగతుల సామాజిక న్యాయం, హక్కుల సాధనే లక్ష్యంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ శనివారం మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ధర్మ దీక్ష’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమానికి పలు బీసీ సంఘాల నేతలు తరలివచ్చి మద్దతు తెలిపారు.
​గతంలో నిర్వహించిన ‘బీసీ సింహగర్జన’ వేదికగా ప్రభుత్వం ముందుంచిన ఐదు ప్రధాన డిమాండ్లపై పాలకులు స్పందించకపోవడంతోనే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
​మండల్, పూలే వారసుల సంఘీభావం
​ఈ దీక్షా కార్యక్రమానికి బీపీ మండల్ మనవడు డాక్టరు సూరజ్ మండల్, మహాత్మా జ్యోతిబా పూలే మునిమనవరాలు డాక్టరు ఎస్. పూలే హాజరై రామచంద్ర యాదవ్‌కు సంఘీభావం ప్రకటించడం విశేషం.


​ఈ సందర్భంగా డాక్టరు సూరజ్ మండల్ మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి పోరాటం చేస్తున్న రామచంద్ర యాదవ్ కృషి అభినందనీయమని కొనియాడారు. రాజ్యాధికారంలో బీసీలకు సముచిత వాటా దక్కినప్పుడే సామాజిక సమన్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
​హక్కుల సాధనకే ఈ పోరాటం: డాక్టరు ఎస్. పూలే
​జ్యోతిబా పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అణగారిన వర్గాల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని డాక్టరు ఎస్. పూలే తెలిపారు. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం సమాన హక్కులు దక్కాల్సిన సమయం ఆసన్నమైందని, అమరావతిలో బీసీల ఉనికి కోసం రామచంద్ర యాదవ్ చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని ఆమె మద్దతు పలికారు.
​ప్రభుత్వానికి నివేదించిన ప్రధాన డిమాండ్లు:
​రామచంద్ర యాదవ్ తన దీక్ష ద్వారా ప్రభుత్వం ముందు ఐదు కీలక అంశాలను ఉంచారు:
​బీసీ రక్షణ చట్టం: బీసీల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి.
​అమరావతిలో భూ కేటాయింపు: రాజధాని ప్రాంతంలో బీసీ భవనాలు, విద్యా కేంద్రాల కోసం 1,000 ఎకరాలు కేటాయించాలి.
​సమగ్ర కులగణన: రాష్ట్రంలో బీసీల వాస్తవ జనాభా లెక్కలను తేల్చేలా శాస్త్రీయంగా కులగణన చేపట్టాలి.
​44 శాతం రిజర్వేషన్లు: విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
​కార్పొరేషన్లకు నిధులు: నామమాత్రంగా ఉన్న బీసీ కార్పొరేషన్లకు తగినన్ని నిధులు కేటాయించి బలోపేతం చేయాలి.
​రామచంద్ర యాదవ్ దీక్ష ప్రారంభంతో మంగళగిరి ప్రాంతంలో రాజకీయ సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలుపుతున్నారు.

About Author