మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 9,2024:”బలమైన శరీరం ఉంటేనే, బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 9,2024:“బలమైన శరీరం ఉంటేనే, బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే, మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరమైన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లినప్పుడు అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాను. ఇచ్చిన మాట మేరకు నా సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చాను” అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ తెలిపారు.

మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. “రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి, ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్ళిపోతాం” అన్నారు.

బుధవారం రాత్రి మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుండి రూ. 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ: “రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన సందర్భంగా మైసూరవారిపల్లి గ్రామ సభలో స్వయంగా పాల్గొనడం జరిగింది. ఈ సభలో ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం లేదు అని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆట స్థలానికి భూమి కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు.

పంచాయతీ పరిధిలో ఎంతో కొంత ప్రభుత్వ భూమి ఉంటుందని కేటాయించవచ్చు అనుకుంటే, మైసూరవారిపల్లికి సెంటు ప్రభుత్వ భూమి కూడా లేదు అని తెలిసింది. ప్రతి ఒక్కరు మన పిల్లలు దృఢంగా తయారవ్వాలి, చదువుకోవాలి, మానసికంగా ఎదగాలి అని కోరుకుంటాము. పాఠశాలల్లో పరిస్థితులు చూస్తే అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో పిల్లల్ని పెట్టేస్తారు. ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా లేక పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు.”

“నేను రాజకీయాల్లోకి రాక ముందు ప్రజలకు ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో ఎన్జీవోగా ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ పేరిట ఓ ట్రస్ట్ మొదలు పెట్టాను. అవసరం ఉన్న చోట విద్యార్థులకు సాయం చేయడం, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం దాని ఉద్దేశం. ఎంతో మంది చదువులకు సాయం చేసినా, బయటకి చెప్పుకోవడం అలవాటు లేదు. అయితే మైసూరవారిపల్లి పాఠశాల కోసం స్థలం అడిగితే ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రాథమిక వైద్యశాల కోసం మాత్రం శ్రీ కారుమంచి నారాయణ గారు స్థలం ఇస్తానన్నారు.”

“ఆట స్థలం కోసం రూ. 20 లక్షలు సొంత ట్రస్ట్ నుండి ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. మిగిలిన మొత్తం దాతల సహకారం తీసుకోమని చెప్పాను. దసరా లోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని గ్రామ సభలో మాటిచ్చాము. రెండు రోజుల క్రితం కార్యాలయం అధికారులు ఆట స్థలం వ్యవహారంలో ముందుకు వెళ్లలేకపోతున్న విషయాన్ని తెలియపరిచారు.

చివరికి రూ. 60 లక్షలు సొంత ట్రస్టు నుంచే ఇచ్చేయాలని నిర్ణయించాము. ఆట స్థలం కోసం పగడాల పద్మావతి భూమిని గుర్తించాము. ఆమె కూడా పిల్లల కోసం విక్రయించేందుకు ముందుకు రావడంతో కొనుగోలు చేసి పిల్లల కోసం ఆట స్థలం సమకూర్చాము” అని ఆయన వివరించారు.

స్థల విక్రేతలకు సత్కారం, విద్యార్థులకు క్రీడా పరికరాలు
మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం కోసం భూమి విక్రయించిన పగడాల పద్మావతిని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సత్కరించారు. పాఠశాల విద్యార్థులకు క్రికెట్ కిట్లు, వాలీబాల్, ఫుట్‌బాల్, చెస్ బోర్డు తదితర క్రీడా పరికరాలు రెండు సెట్లు బహూకరించారు. విద్యార్థులు, స్థల విక్రేతలతోపాటు ఆట స్థలం ఏర్పాటుకు సహకరించిన పార్టీ నాయకులు, అధికారులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ , రైల్వే కోడూరు శాసన సభ్యులు అరవ శ్రీధర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, రాజంపేట సబ్ కలెక్టర్ నిదియా దేవి, మైసూరవారిపల్లి సర్పంచ్ కారుమంచి సంయుక్త , స్థల విక్రేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author