మొంథా తుపాను నష్టం: ప్రతి రైతును ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అవనిగడ్డ, అక్టోబర్ 30, 2025: మొంథా తుపాను కారణంగా పంట నష్టం జరిగిన రైతులందరినీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఉప

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అవనిగడ్డ, అక్టోబర్ 30, 2025: మొంథా తుపాను కారణంగా పంట నష్టం జరిగిన రైతులందరినీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం సంభవించగా, కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా ఉందని, ఈ జిల్లాలో దాదాపు 56,000 మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు.

గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కళ్యాణ్, తుపాను దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. అనంతరం అవనిగడ్డలో జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన తుపాను నష్టం ఫోటో ప్రదర్శనను పరిశీలించి, మీడియాతో మాట్లాడారు.

ముందస్తు సన్నద్ధతతో నష్టం తగ్గింపు: పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత కారణంగా మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అనుభవపూర్వక దూరదృష్టితో పక్కా ప్రణాళికలు అమలు చేసి నష్ట తీవ్రతను తగ్గించాం. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలూ పరిస్థితిని సమీక్షించి, యంత్రాంగాన్ని, గ్రామస్థాయి ప్రజలను అప్రమత్తం చేశాం.

లక్ష 16 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాం. కౌలు రైతులు కూడా నష్టపోయిన విషయం గుర్తించాం, వారి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం” అని పేర్కొన్నారు.

తక్షణ ఉపశమన చర్యలు: తుపాను అనంతర ఉపశమన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 274 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, వీటిని శాశ్వతంగా పునరుద్ధరించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామాల్లో నీటి నిల్వలను తొలగించడం, అంటు వ్యాధులను నివారించేందుకు సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ చర్యలను ప్రారంభించామని చెప్పారు.

1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం కాగా, 21,055 మంది సిబ్బందిని పారిశుద్ధ్య కార్యక్రమాలకు నియోజించామన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తిన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఆర్థిక సాయం,సహాయం: పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి 25 కేజీల బియ్యం, మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం, అలాగే 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ పంచదారను ఉచితంగా అందిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శిబిరాల నుండి ఇళ్లకు వెళ్లే ముందు ఒక్కొక్కరికీ రూ.1,000, ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.3,000 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. నష్టంపై ప్రాథమిక నివేదిక సిద్ధమైన వెంటనే కేంద్ర సహాయం కోరతామని చెప్పారు.

మౌలిక సదుపాయాల పునరుద్ధరణ: కోడూరు మండలంలో సముద్ర కట్టపై దెబ్బతిన్న అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను నాబార్డ్ సాయంతో కొత్తగా నిర్మిస్తామని, ఎదురుమొండి దీవుల్లో సముద్ర కోతకు దెబ్బతిన్న ఎదురుమొండి-గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.08 కోట్లు కేటాయించామని, టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. ఈ రహదారి ఐదు గ్రామాల ప్రజల రవాణా సమస్యలను తీరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

పర్యటనలో పాల్గొన్నవారు: ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర,వాసంశెట్టి సుభాష్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా స్పెషల్ ఆఫీసర్, టూరిజం శాఖ ఎండీ శ్రీమతి అమ్రపాలి, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author