శ్రీకాకుళం RTC బస్స్టాండ్ పరిశీలించిన ఎమ్మెల్సీ కె. నాగబాబు..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీకాకుళం, అక్టోబర్ 16, 2025: శాసన మండలి సభ్యులు కె. నాగబాబు గురువారం శ్రీకాకుళం RTC బస్స్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీకాకుళం, అక్టోబర్ 16, 2025: శాసన మండలి సభ్యులు కె. నాగబాబు గురువారం శ్రీకాకుళం RTC బస్స్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ప్రజలు, జనసేన పార్టీ నాయకులు వర్షాల సమయంలో వరద నీటి కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సమస్యల గురించి వినతి పత్రాల ద్వారా కె. నాగబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వినతులు ఆధారంగా బస్స్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు.
అధికారులతో చర్చలు
ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడిన తర్వాత, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొరికన రవికుమార్ తో కలిసి RTC అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో చర్చలు జరిపారు. నిత్యం సుమారు 60,000 మంది ప్రయాణికులు రాకపోకలు చేసే శ్రీకాకుళం బస్స్టాండ్ అభివృద్ధి అవకాశాల గురించి అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న 25 ప్లాట్ఫారమ్లను 40కి పెంచి ఇంటిగ్రేటెడ్ బస్స్టాండ్ నిర్మించడం ద్వారా ప్రయాణికులకు అనుకూలత కల్గుతుందని, ఆదాయ వనరుగా కూడా పనిచేస్తుందని తెలిపారు.
లిఫ్టింగ్ పద్ధతిలో వరద నీటిని తోడి డ్రైనేజీలకు పంపే విధానం గురించి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుగుణాకర్ వివరించారు. నగరానికి సమీపంలో నూతన బస్స్టాండ్ నిర్మాణం కూడా ఒక మార్గంగా చైర్మన్ కొరికన రవికుమార్ ప్రస్తావించారు.

ఎమ్మెల్సీ వ్యాఖ్యలు
అధికారులతో చర్చలు జరిపిన తర్వాత మాట్లాడిన కె. నాగబాబు, “మాకు కూడా RTC బస్సుల్లో తిరిగిన అనుభవాలు ఉన్నాయి. ప్రయాణికుల సమస్యలు మాకు తెలుసు. సాధ్యమైనంత త్వరగా శ్రీకాకుళం బస్స్టాండ్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయాలి. తక్షణ అనుకూలమైన పనులకు నివేదిక రూపంలో అందిస్తే, శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రస్తావించి, ఎమ్మెల్సీగా సాధ్యమైనంత మేరకు శ్రీకాకుళం బస్స్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తాను” అని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా నాయకులు డా. విశ్వక్ సేన్, పిసిని చంద్రమోహన్, గేదెల చైతన్య, డా. వేగులాడ దుర్గారావు, దాసరి రాజు, పేడాడ రామ్మోహన్, కొండా ఉదయ్ శంకర్, గురు ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.