ప్రయాగ్ రాజ్లో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 6,2025: మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్లోని సెక్టార్-19లో ఉన్న ఇస్కాన్ క్యాంపులో గురువారం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 6,2025: మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్లోని సెక్టార్-19లో ఉన్న ఇస్కాన్ క్యాంపులో గురువారం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రారంభంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస స్వామి వారి ఉత్సవర్లను భక్తి శోభతో కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య భక్తిశ్రద్ధలతో వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మాంగళ్య పూజ, మంగళసూత్రధారణ వంటి విశేష ఘట్టాలతో శ్రీ స్వామి వారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

తుదిగా శ్రీ స్వామివారికి నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడంతో ఈ మహోత్సవం వైభవంగా ముగిసింది. స్వామి వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తులు కళ్యాణ ఘట్టాన్ని మంత్ర ముగ్ధులై తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, హెచ్డీపీపీ అదనపు కార్యదర్శి శ్రీ రామ్ గోపాల్, ఏఈవో శ్రీ రవి ఇతర అధికారులు పాల్గొన్నారు.