ఇప్పటంలో బామ్మ నాగేశ్వరమ్మ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మంగళగిరి, డిసెంబర్ 24, 2025: రాజకీయాల్లో ఇచ్చిన మాట తప్పని నేతగా తన ప్రత్యేకతను చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ హయాంలో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలను ధైర్యంగా ఎదిరించిన వృద్ధురాలు శ్రీమతి ఇండ్ల నాగేశ్వరమ్మ కి ఇచ్చిన మాట మేరకు, బుధవారం ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు. అధికారిక కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకు స్వయంగా ఆమె నివాసానికి వెళ్లారు.

“అమ్మా.. నీ పెద్ద కొడుకుని వచ్చాను”
నాగేశ్వరమ్మ గారి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆమెను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. “అమ్మా.. నీ పెద్ద కొడుకుని వచ్చా.. బాగున్నావా?” అంటూ పలకరిస్తూ ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. గతంలో ఇప్పటం బాధితులను పరామర్శించిన సమయంలో ‘గెలిచిన తర్వాత తన ఇంటికి రావాలి’ అని నాగేశ్వరమ్మ కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఆ మాట కోసమే ఈరోజు వచ్చానని ఆయన తెలిపారు.

ఉదారత చాటుకున్న ఉప ముఖ్యమంత్రి:
నాగేశ్వరమ్మ కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తక్షణమే భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు:

వ్యక్తిగత ఆర్థిక సాయం: నాగేశ్వరమ్మ కి సంక్రాంతి కానుకగా కొత్త చీరతో పాటు, ఖర్చుల నిమిత్తం ₹50,000 నగదును అందజేశారు.

మానవత్వం: నేటికీ నాగేశ్వరమ్మ కూలి పనులకు వెళ్తున్నారని తెలుసుకుని చలించిపోయిన ఆయన, పిఠాపురం అనాథ చిన్నారులకు ఇస్తున్న విధంగానే, ప్రతి నెల తన జీతం నుంచి ₹5,000 ఆమె పోషణ నిమిత్తం పంపనున్నట్లు హామీ ఇచ్చారు.

విద్య & వైద్యం: ఆమె మనుమడు మనోజ్ సాయి చదువుల కోసం ₹1,00,000 అందజేశారు. అలాగే, క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె కుమారుడు కొండయ్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ₹3 లక్షలు మంజూరు చేశారు.

ఇప్పటం పర్యటన ఆద్యంతం ప్రజల కోలాహలం మధ్య సాగింది. కొలనుకొండ, ఇప్పటం గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నిలబడ్డ జనం పూల వర్షంతో ఆయనకు స్వాగతం పలికారు. తిరుగు ప్రయాణంలో పూలతోటల్లో పని చేస్తున్న కూలీలతో ముచ్చటించిన పవన్ కళ్యాణ్, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు విన్నవించిన విద్యుత్ స్తంభాలు, పింఛన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పవన్ కళ్యాణ్ మానవత్వంపై శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, “2022లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఇళ్లు కూలగొట్టినప్పుడు బాధితులకు అండగా నిలిచిన పవన్ , నేడు అధికారం ఉన్నా పాత బంధాలను మర్చిపోకుండా సామాన్యుల ఇంటికి రావడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం” అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు,జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author