నవంబర్ 1 నుంచి డి.డి.ఓ. కార్యాలయాలు ప్రారంభం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 23,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ , స్థానిక సంస్థల బలోపేతం కోసం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 23,2025: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ , స్థానిక సంస్థల బలోపేతం కోసం పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చామని, వాటి ఫలితాలను ప్రజలకు సమర్థవంతంగా అందించే బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
నవంబర్ 1, 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల (డి.డి.ఓ.) కార్యాలయాలను ప్రారంభించాలని ఆదేశించారు.
గురువారం (అక్టోబర్ 23, 2025) మధ్యాహ్నం పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చడం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు మరియు గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని వివరించారు.
15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు, పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం నిధుల సమీకరణ, పాలన సంస్కరణలలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని, ఈ సంస్కరణల ఫలితాలను గ్రామీణ ప్రజలకు చేర్చడంలో అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.
నిధుల వినియోగం ,సంస్కరణల అమలుపై ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహించాలని, పల్లె పండగ 2.0 ద్వారా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు సంపూర్ణ ప్రణాళిక సిద్ధం చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.