మార్కెట్లో ‘మంట’ పెట్టిన ముడిచమురు! ఐటీ రంగం విలవిల

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 28,2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఘోర పతనాన్ని చవిచూశాయి. క్రూడాయిల్‌ బ్యారెల్ ధర

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 28,2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఘోర పతనాన్ని చవిచూశాయి. క్రూడాయిల్‌ బ్యారెల్ ధర 97 డాలర్లకు పెరగడం ఇన్వెస్టర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది.

మరికొన్ని రోజుల్లోనే 100 డాలర్లకు చేరుకుంటుందన్న అంచనాలతో వారు అమ్మకాలు చేపట్టారు. దీనికి తోడు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను అత్యధిక స్థాయిలోనే ఉంచుతాయన్న వార్తలు చేటు చేశాయి.

ఆసియా, ఐరోపాలో మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 83.19 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 610, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 193 పాయింట్ల మేర పతనమయ్యాయి.

క్రితం సెషన్లో 66,118 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,406 వద్ద మొదలైంది. కాసేపు ఫ్లాట్‌గా చలిచింది. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు పెరిగాయన్న వార్తలు రాగానే పతనం మొదలైంది. ఆరంభ స్థాయి వద్దే గరిష్ఠాన్ని నమోదు చేసిన సూచీ 65,423 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.

చివరికి 610 పాయింట్లు పతనమై 65,503 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.3 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. గురువారం ఉదయం 19,761 వద్ద ఆరంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19,766 వద్ద గరిష్ఠాన్ని తాకింది.

ఆపై 19,429 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. మొత్తంగా 192 పాయింట్లు నష్టపోయి 19,523 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 287 పాయింట్లు ఎరుపెక్కి 44,300 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50లో 8 కంపెనీలు లాభపడగా 42 నష్టపోయాయి. ఎల్‌టీ (2.04%), భారతీ ఎయిర్‌టెల్‌ (1.17%), ఓఎన్‌జీసీ (0.51%), కోల్‌ ఇండియా (0.46%), పవర్‌ గ్రిడ్‌ (0.43%) టాప్‌ గెయినర్స్‌. టెక్‌ మహీంద్రా (4.16%), ఏసియన్‌ పెయింట్స్‌ (3.69%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (3.02%), ఎంఅండ్‌ఎం (2.19%), విప్రో (2.08%) టాప్‌ లాసర్స్‌.

రంగాల వారీగా చూస్తే ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఆటో, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, మెటల్‌, ఫార్మా సూచీలు ఎక్కువ నష్టపోయాయి. బ్యాంకు, ఎనర్జీ, ఫైనాన్స్‌ రంగాలు స్వల్పంగా ఎరుపెక్కాయి.

నిఫ్టీ అక్టోబర్ ఫ్యూచర్స్‌ను పరిశీలిస్తే 19,740 వద్ద రెసిస్టెన్సీ, 19,620 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్ల స్వల్ప కాలానికి ఫినోలెక్స్‌ కేబుల్స్‌, ఆర్బీఎల్‌, అరవింద్‌ టెక్స్‌టైల్‌, నైకా, ఎరిస్‌ ఫార్మా, ఎరిస్ లైఫ్ సైన్సెస్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు. నిఫ్టీ పతనంలో రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, ఏసియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌ కీలక పాత్ర పోషించాయి.

డాక్టర్‌ రెడ్డీస్‌ ఆరోగ్య ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా సబ్సిడరీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. కోఫోర్జ్‌కు రూ.82.93 కోట్ల ఆదాయ పన్ను నోటీసులు వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంకులో 14.36 లక్షల షేర్లు చేతులు మారాయి.

బలరాంపుర్‌ చైని, సీఈ ఇన్ఫోసిస్టమ్స్‌, చోలమండలం, కోల్‌ ఇండియా, సీఎస్‌బీ బ్యాంకు, డిక్సన్‌ టెక్నాలజీస్‌, ఫినోలెక్స్‌, పాలీక్యాబ్‌ ఇండియా, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌, టీవీఎస్‌ మోటార్స్ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి.

కల్యాణ్‌ జువెలర్స్‌లో 15 లక్షలు, హ్యాపీయెస్ట్‌ మైండ్స్‌లో 13.7 లక్షల షేర్లు చేతులు మారాయి. అదానీ పవర్స్‌లో ప్రమోటర్లు అదనంగా 2.21 శాతం వాటాను కొనుగోలు చేశారు. రూ.5,716 కోట్ల విలువైన కమర్షియల్‌ స్పేస్‌ను విక్రయిస్తామని చెప్పడంతో ఎన్‌బీసీసీ షేర్లు పెరిగాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.

About Author